అక్కడ ఒమిక్రాన్‌ కలకలం.. భారత్‌లో ‘నో’ కోవిడ్‌ రూల్స్‌.. ఎప్పటి నుంచో తెలుసా..?

23 Mar, 2022 14:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కనిష్ట స్థాయిలో రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు కోవిడ్‌ నిబంధనలను సడలించాయి. కాగా, కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో భద్రతా చర‍్యల కోసం కేంద్రం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేంద్రం కొవిడ్‌ రూల్స్‌ విధించిందిన విషయం తెలిసిందే.

అయితే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ నుంచి అన్ని నిబంధనలను తొలగిస్తున్నట్టు బుధవారం కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్క్‌ ధరించాల్సి ఉంటుందని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం కేంద్రం తీసుకున్న కోవిడ్‌ రూల్స్‌ మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు.. యూరప్‌, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, జర్మనీలలో ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 23, బుధవారం నాటికి 1,81,89,15,234 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తైంది. దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం టీకాలు అందిస్తోంది. ఇక, కోవిషీల్డ్‌ టీకాల మధ్య గ్యాప్‌ను కూడా కేంద్రం 8-16 వారాలకు తగ్గించిన విషయం తెలిసిందే. కోవాగ్జిన్‌ టీకాల మధ్య గ్యాప్‌ 28 రోజులుగా ఉంది.

ఇది చదవండి: బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే సమాధి.. అధికారులు పట్టించుకోకపోవడంతో..

మరిన్ని వార్తలు