స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు తప్పనిసరి.. దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!

14 Apr, 2023 08:35 IST|Sakshi

లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడా ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ బారినపడకుండా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

మరోవైపు పని ప్రదేశాల్లో యజమాన్యాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని  అధికారులు తెలిపారు. కార్యాలయాలను శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ ఉష్ణోగ్రత స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎవరైనా ఉద్యోగుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని చెప్పారు. లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ఉద్యోగులకు సూచించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో దాని పక్కనే ఉన్న గౌతమ్‌ బుద్ధ నగర్‌, సహా ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నోయిడా అధికారులు ఈమేరకు చర్యలు చేపట్టారు.  దేశ రాజధానిలో గురువారం 1,527 కరోనా  కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే ఇవి 33 శాతం అధికం. పాజిటివీ రేటు కూడా 27.7 శాతంగా ఉంది. దీంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యగా చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.
చదవండి: సూరత్‌ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’

మరిన్ని వార్తలు