Noida Twin Towers Demolition: వ్యర్థాల తొలగింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా!

28 Aug, 2022 15:04 IST|Sakshi

లక్నో: నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన నోయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతపై దేశమంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నోయిడాలో ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. 

వాటర్ పాల్ టెక్నిక్‌ను ఉపయోగించి..100 మీటర్ల దూరం నుంచి అధికారులు బటన్‌ను నొక్కడం ద్వారా టవర్లు నేలమట్టమయ్యాయి. 9 సెకన్లలోనే రెండు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భవనాలు కూలడంతో దాదాపు 40 మీటర్లమేర దట్టమైన పొగ కమ్ముకుంది.
చదవండి: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్‌ టవర్స్‌ .. 9 సెకన్లలోపే.. 

అయితే ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత తర్వాత నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు 3 నెలల సమయం పట్టనుందని అధికారులు వెల్లడించారు. 55,000 నుంచి 80 వేల టన్నుల శిథిలాలను తరలించనున్నారు. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఇక ఈ రెండు భవనాల్లో ఒకటి 103 మీటర్ల ఎత్తు, మరొకటి 97 మీటర్ల ఎత్తు ఉన్నాయి.
చదవండి: మీకు తెలియని ఆసక్తికర విషయాలు : ట్విన్‌ టవర్స్‌ కూలడానికి ఆ నలుగురే కారణం!

కూల్చివేతల్లో ఒక్కో చదరపు అడుగుకు రూ. 267 ఖర్చు అవుతుండగా... 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు కూల్చివేతకు రూ. 20కోట్లు ఖర్చు అవుతోంది. రూ. 70 కోట్లతో నిర్మించిన ఈ భవనాల ప్రస్తుత విలువ అక్షరాల 1, 200 కోట్లు.

ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అలాగే కూల్చివేసిన తర్వాత దుమ్ము, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన కొద్ది నిమిషాల్లోనే గాలిలో దుమ్ము, దూళిని క్లియర్ చేయనున్నారు.

దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ట్విన్ టవర్స్‌ చుట్టుపక్కల ఉన్న స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అంతేగాక నోయిడాలోని ఓ స్వ‌చ్ఛంద సంస్థ రంగంలోకి దిగి ఇప్ప‌టివ‌ర‌కు ప‌రిస‌రాల్లోని 35 వీధి కుక్క‌ల‌నుపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మరిన్ని వార్తలు