రైతులు చేప‌ట్టిన బంద్ పొడిగింపు

26 Sep, 2020 16:32 IST|Sakshi

చండీగ‌ఢ్: కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ బిల్లులకు నిర‌స‌న‌గా భార‌త్‌ బంద్‌కు పిలుపున్చిన రైతు సంఘాలు త‌మ ఆందోళ‌న‌ను సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు పొడిగించాయి. ఈ సంద‌ర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి రాష్ట్ర కార్యదర్శి సర్వాన్ సింగ్ పాంధర్ మాట్లాడుతూ.. దేశ‌వ్యాప్తంగా రైతులంద‌రి నుంచి త‌మ‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని, ఇది ప్ర‌జా ఉద్య‌మం అని పేర్కొన్నారు. తాము బిల్లుల‌ను చదివామ‌ని, కార్పొరేట్ల కంపెనీల ప్ర‌యోజ‌నాల‌కే ప్రధాని మోదీ పెద్ద‌పీట వేస్తున్నార‌ని విమ‌ర్శించారు. త‌మ వైఖ‌రిపై ప్ర‌తిప‌క్షాల‌ను దోషులుగా చేసి మాట్లాడ‌టం స‌రైంది కాని అభిప్రాయ‌ప‌డ్డారు. వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ తాము చేప‌ట్టిన రైల్ రోకో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. (వ్యవసాయ బిల్లులు : మోదీ సర్కార్‌పై బాదల్‌ ఫైర్‌)

ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏ రాజ‌కీయ పార్టీని అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదివ‌ర‌కే వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లో ఎస్‌ఏడీ ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. రైల్ రోకోలో భాగంగా పంజాబ్‌లో వేలాదిమంది రైతులు రైల్వే పట్టాలపై అడ్డంగా పడుకుని నిర‌స‌న చేప‌డుతున్నారు. దాదాపు 28 ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను అడ్డుకున్న‌ట్లు స‌మాచారం. కేంద్రం తమ వైఖ‌రి మార్చుకోకుంటే త‌మ ఆందోళ‌న‌ల్ని ఉదృతం చేస్తామ‌ని పేర్కొన్నారు.

మ‌రోవైపు రైతుల‌కు అర్థ‌మ‌య్యేలా వ్య‌వ‌సాయ బిల్లుల ప్రాధాన్య‌త వివ‌రించాల‌ని, ప్ర‌తిప‌క్షాలు రైతుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్య‌వ‌సాయ, కార్మిక చట్టాల సంస్కరణల కోసం తీసుకొచ్చిన బిల్లులను పూర్తిగా సమర్థించుకున్న మోదీ.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు. (వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలే)

మరిన్ని వార్తలు