క్యాబ్‌లో కోటి రూపాయల నగల బ్యాగు.. ఎన్నారైను టెన్షన్‌ పెట్టిన నాలుగు గంటలు

1 Dec, 2022 21:14 IST|Sakshi

ఢిల్లీ: ఏమరపాటులో చేసే పని.. ఒక్కోసారి తీవ్రపరిణామాలకు దారి తీస్తుంటుంది. తన కూతురి పెళ్లి కోసం నగలతో వచ్చిన ఓ ఎన్నారైకి అలాంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు గంటల పాటు పోలీస్‌ స్టేషన్‌లో టెన్షన్‌.. టెన్షన్‌గా  గడిపాడు ఆ పెద్దయాన. 

నిఖిలేష్‌ సిన్హా(50).. లండన్‌ నుంచి తన కూతురి వివాహం కోసం వచ్చారు. గ్రేటర్‌ నోయిడాలో ఓ హోటల్‌లో బస చేసిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఊరికి వెళ్లేందుకు లగేజీతో ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకుని బయల్దేరారు. అయితే.. తీరా గమ్యస్థానం చేరుకున్నాక ఆయన ఓ బ్యాగ్‌ను క్యాబ్‌లోనే మరిచిపోయి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాతే ఆయన తలపట్టుకున్నారు. ఆ బ్యాగులో సుమారు కోటి రూపాయల విలువ చేసే నగలు ఉన్నాయట. 

దీంతో ఆలస్యం చేయకుండా ఆయన బిస్రాఖ్‌ పోలీసులను ఆశ్రయించాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆ క్యాబ్‌ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి.. నాలుగు గంటల్లో ఆ క్యాబ్‌ ఉన్న లొకేషన్‌ గుర్తించారు. తీరా.. ఘజియాబాద్‌ లాల్‌ కౌన్‌ వద్ద క్యాబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే.. ఆ పెద్దాయన క్యాబ్‌లో బ్యాగ్‌ మరిచిపోయిన విషయం తనకు తెలియదని డ్రైవర్‌ పోలీసులతో చెప్పాడు. 

దీంతో నేరుగా క్యాబ్‌, డ్రైవర్‌తో సహా స్టేషన్‌కి చేరుకున్న పోలీసులు.. నిఖిలేష్‌ ముందే ఆ బ్యాగ్‌ను ఓపెన్‌ చేసి నగలను అప్పగించారు. పోలీసుల త్వరగతిన స్పందన ఎన్నారై నిఖిలేష్‌ సంతోషం వ్యక్తం చేసి.. క్యాబ్‌ డ్రైవర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది.

ఇదీ చదవండి: మీరు దళితులు.. మీకు ఏం అమ్మం!

మరిన్ని వార్తలు