అత్తారింటికి వెళ్తూ అతిగా ఏడ్వటంతో...

5 Mar, 2021 19:43 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఒడిసా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం..మురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె  గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్‌ అనే యువకుడితో గురువారం రాత్రి వివాహం జరిపించారు. మరుసటి రోజు (నేడు)ఉదయం వధువును అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అప్పగింతల కార్యక్రమంలో నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది.


దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు. అప్పగింతల్లో అతిగా ఏడ్వడం వల్ల గుండెపోటు వచ్చిందని, దీంతో వధువు చనిపోయినట్లు పేర్కొన్నారు. పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు చనిపోవడంతో కుటుంబసభ్యులు సహా బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నీరసం వల్ల కళ్లు తిరిగి పడిపోయిందని భావించామని, ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు. వధువు మృతితో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. 

చదవండి : (బట్టతల దాచి పెళ్లి: భర్తకు షాకిచ్చిన భార్య!)
(ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్‌.. లక్కీ డ్రా!)

మరిన్ని వార్తలు