మహమ్మారి.. పొంచే ఉంది!

21 Apr, 2022 23:34 IST|Sakshi

భువనేశ్వర్‌: రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల నమోదు అదుపులో కొనసాగుతోంది. అయితే రోజూ 10 నుంచి 20 వరకు మాత్రమే కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగడంతో కోవిడ్‌ మహమ్మారి పొంచి ఉందనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. మరోసారి పూర్వ పరిస్థితులు విజృంభించకుండా జాగ్రత్తలు పాటించడం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోవిడ్‌–19 ఆంక్షలు తొలగించినా.. మాస్కు ధరించడం, ఇతర నివారణ చర్యలను యథాతధంగా కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ నిరంజన్‌ మిశ్రా బుధవారం వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగైదు రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు తరచూ పెరుగుతోందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రతిపాదించామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా ప్రధాన వైద్యాధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. కరోనా విజృంభణ పునరావృతం కాకుండా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని, కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షల పరిమితి విస్తరించాలని సూచించారు. పాజిటివ్‌ కేసుల నమోదు పెరిగిన సందర్భాల్లో చేపట్టాల్సిన సత్వర కార్యాచరణకు మార్గదర్శకాలను అనుబంధ యంత్రాంగాలకు జారీ చేశారు. 

విశ్వసనీయ సమీక్ష.. 
కోవిడ్‌ కేసుల నమోదు ఆధారంగా రాష్ట్రంలో నివారణ, నియంత్రణ కార్యాచరణ చేపట్టనున్నారు. నిబంధనల అమలు, సడలింపు, తొలగింపు వ్యవహారాలకు విశ్వసనీయ నివేదిక కీలకంగా ప్రజారోగ్య శాఖ పేర్కొంది. జిల్లాస్థాయిలో నిత్యం నమోదవుతున్న కేసులు, విశ్వసనీయ నివేదికతో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. పాజిటివ్‌ కేసుల నిర్ధారణతో సంక్రమణ తీవ్రత, పరిధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆస్పత్రి వ్యవస్థ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. నిర్ధారిత విధానాల్లో కోవిడ్‌ పరీక్షలు చేపడుతూ పెరుగుదల, తీవ్రత వంటి విపత్కర సంకేతాలపై నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కరోనా తీవ్రత ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల ఆరోగ్య స్థితిగతుల పట్ల నిఘా పటిష్ట పరచాలని తెలిపారు. విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్న జనసమూహ బహుళ అంతస్తు భనవ సముదాయాలు, హాస్టళ్లు, విద్యాసంస్థలు వంటి ప్రాంతాల్లో తరచూ పరీక్షల నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు. కోవిడ్‌ సంక్రమణ నియంత్రణ, నివారణ కోసం స్థానికంగా అనుబంధ వ్యవస్థ, వైద్య పరీక్షల పరికరాలతో యంత్రాంగం అనుక్షణం సిద్ధం కావాలని వివరించారు.

వైద్యారోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు.. 
► భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌ఏ) తరచూ జారీ చేస్తున్న తాజా మార్గదర్శకాల మేరకు కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు చేపట్టడం అనివార్యం. 
► కరోనా రోగుల చికిత్స కోసం గృహ నిర్బంధం, ఆస్పత్రి సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 
► కోవిడ్‌ ఆరోగ్య సంరక్షణ కార్యాచరణ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి. 
► నిబంధనల మేరకు కోవిడ్‌ టీకాల ప్రదాన ప్రక్రియ పూర్తి చేయడం పట్ల శ్రద్ధ వహించాలి. 
► సామాజిక భాగస్వామ్యంతో వ్యాప్తి నివారణ, ప్రయాణ సమయం, జన సందోహిత ప్రాంతాల సందర్శన, కార్యాలయాల సముదాయాల్లో తిరుగాడే వారంతా మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేశారు. 
► సామాజిక దూరం, రద్దీతో పరిసరాలు గుమిగూడకుండా ప్రజలు తిరుగాడుతూ కరోనా నివారణ పట్ల చైతన్యవంతం కావాలి. 
►జన సందోహిత ప్రాంతాల్లో ఉమ్మడం నిషేధించారు. 
► పనులు జరిగే చోట్ల చేతులు శుభ్రం చేసుకునేందుకు సదుపాయాలతో శానిటైజర్‌ వ్యవస్థ తప్పనిసరి. 
► గాలి వీచేలా సదుపాయాలతో పనులు జరిగే ప్రాంతాల్లో పర్యావరణ అనుకూలత కల్పించాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు