భువనేశ్వర్ : తెలియక చేసిన నేరానికి దాయాది దేశం ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడి జైలులో 20 సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించాడు. భూమ్మీద నూకలు, సొంత వాళ్లను చూసుకునే అదృష్టం ఉండి శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా, సుందర్ఘర్ జిల్లాకు చెందిన బ్రిజు కుల్లు అనే వ్యక్తి 1995 సంవత్సరంలో నేరం అని తెలియక పాకిస్తాన్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాడు. దీంతో అతన్ని భారత గూఢాచారిగా భావించిన పాకిస్తాన్ సైనికులు అరెస్ట్ చేసి జైలులో వేశారు. ( కశ్మీర్లో పాక్ దుస్సాహసం )
అలా 20 ఏళ్లకు పైగా లాహోర్ జైలులో మగ్గిపోయాడు. కొద్దిరోజుల క్రితం అతన్ని విడుదల చేశారు. భారత్ చేరుకున్న అతడు 14రోజుల పాటు అమృత్సర్లోని కోవిడ్ హాస్పిటల్లో ఉన్నాడు. శుక్రవారం సుందర్ఘర్ జిల్లా అధికారులు అతడ్ని సొంత ఊరు జంగతేలికి తీసుకువచ్చారు. పాతికేళ్ల తర్వాత సొంతూరికి చేరుకున్న అతడికి ఘన స్వాగతం పలికారు ప్రజలు. పాటలతో, ఆటలతో హంగామా చేశారు.