ఎవరెస్ట్‌ శిఖరాన.. ఎమ్మెల్యే కుమారుడు

16 May, 2022 08:28 IST|Sakshi

భువనేశ్వర్‌: రాష్ట్రానికి చెందిన యువకుడు సిద్ధార్థ్‌ రౌత్రాయ్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. అతను ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్‌కుమార్‌ రౌత్రాయ్‌ కుమారుడు సిద్ధార్థ్‌ రౌత్రాయ్‌ కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 4.15 గంటలకు ఎవరెస్ట్‌ లక్ష్యాన్ని చేరి, కీర్తి ఆర్జించాడని ఎమ్మెల్యే పుత్రోత్సాహం ప్రదర్శించారు.

ఇప్పటి వరకు 45మంది భారతీయ పర్వతారోహకులు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. వీరి సరసన తన కుమారుడు చోటు చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అరుదైన ఎవరెస్ట్‌ శిఖరాగ్ర పర్వతారోహకుని జాబితాలో స్థానం చేజిక్కించుకుని, భారత పతాకం ఎగురు వేశారన్నారు. అలాగే శ్రీమందిరం పతితపావన పతాకం రెపరెపలాడించి, జగన్నాథుని ప్రతిమ స్థాపించామరని వివరించారు. 

ఐరన్‌ మ్యాన్‌గా గుర్తింపు.. 
సిద్ధార్థ్‌ రౌత్రాయ్‌ 3 ఖండాల్లో ఎత్తయిన శిఖరాలను గతంలోనే అవలీలగా అధిరోహించారు. మౌంట్‌ డెనాలీ(ఉత్తర అమెరికా), మౌంట్‌ అకాంకోగువా(దక్షిణ అమెరికా), మౌంట్‌ కిలిమంజారో(ఆఫ్రికా) పర్వత శిఖరాలను చేరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 7 ఖండాల్లోని పర్వతాలను చేరడం అభిలాషగా తెలిపారు. సిద్ధార్‌ కాలిఫోర్నియా ఫాల్‌సమ్‌ ప్రాంతంలో భార్యా, బిడ్డలతో కలిసి ఉంటున్నారు. 2016లో ఫ్లోరిడాలో నిర్వహించిన ట్రయథ్లాన్‌(4 కిలోమీటర్ల ఈత, 180 కిలోమీటర్ల సైక్లింగ్, 42 కిలోమీటర్ల పరుగు పందెం)లో విజయం సాధించి, ఒడియా ఐరన్‌ మ్యాన్‌గా గుర్తింపు సాధించారు. 

చదవండి: వివాహేతర సంబంధం: తెల్లవారుజామున తలుపులు తెరవగానే..

మరిన్ని వార్తలు