ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’..

5 Jun, 2023 08:29 IST|Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్‌ 2) నాడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న దరమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి.  అదే సమయంలో అక్కడ ఒక ప్రేమకథకు ఆనవాళ్లుగా నిలిచిన కాగితాలు చిందరవందరగా పడి కనిపించాయి. ఈ కాగితాలపైగల అక్షరాలు బెంగాలీ భాషలో ఉన్నాయి. అవి ఒక ప్రేమ కథను ప్రతిబింబించాయి.  

వివరాల్లోకి వెళితే ఈ కాగితాలు ఎవరో రాసుకున్న డైరీలో నుంచి చినిగిపోయి చిందరవందరగా అక్కడ పడివున్నాయి. వీటిలో ఒక చేప, సూర్యుడు, ఏనుగు చిత్రాలను గీస్తూ ఎవరో తనలోని ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పేపర్లను పరిశీలనగా చూస్తే ఎవరో ప్రయాణికుడు తన సెలవు రోజుల్లో తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుని గురించి ఇంతవరకూ సమాచారం ఏదీ లభ్యంకాలేదు. ఈ కాగితాలపై బెంగాలీ భాషలో రాసిన ఆ పదాల తెలుగు అనువాదం ఇలా ఉంది ‘నేను నిన్ను ప్రతీ నిముషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’ అని రాసివుంది.

చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు 

ప్రేమను ప్రతిబింబిస్తున్న ఈ అక్షరాలు ఇప్పుడు సోషల్‌​ మీడియాలో వైరల్‌గా మారాయి.  రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న బృందంతో పాటు పోలీసు అధికారులు మాట్లాడుతూ  ప్రేమ కవితలతో కూడిన ఈ కాగితాలను జాగ్రత్తపరుస్తాం. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవే అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ఈ కవితలు ఎవరు రాశారో ఇంతవరకూ తెలియలేదని అన్నారు. కాగా జూన్‌ 2న ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 275 మంది మృతి చెందారు. 1000  మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరంతా బాలేశ్వర్‌, కటక్‌, భువనేశ్వర్‌లలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు