పీరియడ్స్‌లో వేతన సెలవులివ్వాల్సిందే

29 May, 2022 05:28 IST|Sakshi

ఒడిశా మహిళల ఆన్‌లైన్‌ ఉద్యమం

సంబాల్‌పూర్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్‌ సమయంలో వేతనంతో కూడిన సెలువులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఒడిశాలోని సంబాల్‌పూర్‌ పట్టణ యువతులు ఆన్‌లైన్‌ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలుజారీ చేయాలని ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్‌ సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు.

పీరియడ్స్‌ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99 శాతం మంది మహిళలు గరిష్టంగా 24 గంటలపాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తుచేశారు. భారత్‌లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు రుతుస్రావం సమయంలో పెయిడ్‌ లీవులు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని రంజితా ప్రియదర్శిని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు