ఎన్నికల్లో పోటీ చేయను: ఒమర్‌ అబ్దుల్లా

27 Jul, 2020 11:27 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ఎన్నికల్లో పోటీ చేయనని కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని తెలిపారు. ‘జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అత్యంత సాధికారత కలిగిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి సభ్యుడిగా ఉన్నాను. ఆరేళ్లపాటు సభానాయకుడిగా విధులు నిర్వర్తించాను.సాధికారతలేని అసెంబ్లీలో సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదు. అందుకోసం అసెంబ్లీ​ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నాను’ అని ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కశ్మీర్‌ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంది. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయబడింది. కానీ, జమ్మూ కశ్మీర్‌కి ఇచ్చిన వాగ్దానం మాత్రం నెరవేరలేదన్నారు. ఆర్టికల్‌ 370ని తొలగించడం జనాదారణ పొందిన చర్య అయి ఉండవచ్చు. కానీ, దేశ సార్వభౌమ విధానానికి చాలా వ్యతిరేకమని తెలిపారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించడం సరికాదన్నారు. (ఛత్తీస్‌గఢ్‌ సీఎంపై మండిపడ్డ ఒమర్‌ అబ్దుల్లా)

ఒమర్‌ అబ్దుల్లా మార్చి నెలలో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్‌ సేఫ్టీచట్టం కింద ఆయనను 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్‌ హౌస్‌ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు.
 

>
మరిన్ని వార్తలు