Omicron In India: క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలొద్దు..

23 Dec, 2021 10:39 IST|Sakshi

ఒమిక్రాన్‌ ముప్పుతో...ఆంక్షల బాటలో రాష్ట్రాలు

క్రిస్మస్, న్యూఇయర్‌ వేడుకలొద్దు: డీడీఎంఏ ఆదేశం

కోవిడ్‌– 19పై నేడు మోదీ సమీక్ష

Restrictions In India Due To Omicron: డెల్టా కంటే ఒమిక్రాన్‌ కరోనా వేరియెంట్‌ సంక్రమణ శక్తి మూడురెట్లు ఎక్కువని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో... కొత్త వేరియెంట్‌ను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. భారత్‌లో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బుధవారం నాటికి దాదాపు 250 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం దేశంలో కోవిడ్‌–19 తాజా స్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు.  

►దేశ రాజధాని పరిధిలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు గుమిగూడ కుండా చూడాలని కలెక్టర్లకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) ఆదేశాలు జారీచేసింది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు, పండుగలకు జనం గుమిగూడటాన్ని నిషేధించింది. 200 మందికి పరిమితమై వివాహ సంబంధ వేడుకలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి పాజిటివ్‌ కేసు శాంపిల్‌ను జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతోంది. ఢిల్లీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 50 దాటింది
చదవండి: ఒమిక్రాన్‌ ముప్పు: క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలొద్దు..  

►రెండు డోసులు తీసుకొని వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను చూపితేనే జనవరి 1 నుంచి షాపింగ్‌ మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లలోకి అనుమతిస్తామని హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్‌ విజ్‌ ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ పూర్తయితేనే అధికారులతో సహా ఎవరినైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశం ఉంటుందని ఆదేశాలు జారీ అయ్యాయి.

►కేరళలలో ఒమిక్రాన్‌ కేసులు 24కు పెరిగాయి. రాజస్తాన్‌లో మొత్తం 22 మందికి ఒమిక్రాన్‌ సోకింది. 
►ప్రజలు కోవిడ్‌ జాగ్రత్తలను అలక్ష్యం చేస్తున్నారని.. ఇది సరికాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు.

>
మరిన్ని వార్తలు