Omicron కలకలం: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది మిస్సింగ్‌

3 Dec, 2021 16:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది విదేశీయులు ఆచూకీ మిస్సింగ్‌

ఆందోళన వ్యక్తం చేస్తోన్న బెంగళూరు మహానగర పాలికే

బెంగళూరు: ఒమిక్రాన్‌ వేరింయట్‌ ప్రపంచ దేశాలను ఒణికిస్తోంది. తాజాగా భారత్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో బృహన్‌ బెంగళూరు మహనగర పాలికే (బీబీఎంపీ) చేసిన ఓ ప్రకటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన 10 మంది విదేశీ ప్రయాణికులు పత్తా లేకుండా పోయినట్లు వెల్లడించింది. ఆరోగ్య శాఖ అధికారులు వీరి జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు బీబీఎంపీ వెల్లడించింది. 

ఈ సందర్భంగా బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌ గుప్తా మాట్లాడుతూ.. ‘‘విదేశీ ప్రయాణికులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. కొందరు ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదు. అలాంటి వారి కోసం కేంద్రం ఓ ప్రామాణిక ప్రోటోకాల్‌ జారీ చేసింది. దాన్ని అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. జాగ్రత్తగా ఉండండి.. భద్రతా ప్రమాణాలు పాటించండి’’ అని కోరారు. 
(చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్‌.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!)

ఈ సందర్భంగా కర్ణాటక హెల్త్‌ మినిస్టర్‌ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వెలుగు చూసిన తర్వాత అక్కడ నుంచి 57 మంది బెంగళూరుకి వచ్చారు. వీరిలో 10 మంది ఆచూకీ లభించడం లేదు. బీబీఎంపీ వారిని వెతికే పనిలో ఉంది. సదరు ప్రయాణికులు ఫోన్‌ నంబర్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయి. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ లేరు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.
(చదవండి: Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ బయటపడింది ఇలా..!)

కర్ణాటకలో గురువారం రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసినటుల​ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో ఓ విదేశీ ప్రయాణికుడు ఇప్పటికే దేశం విడిచిపోయాడని.. మరోక వ్యక్తి కర్ణాటక స్థానికుడని.. అతడికి ఎలాంటి ప్రయాణ చరిత్రలేదని ఆరోగ్యశాఖ తెలపింది. 

చదవండి: దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌.. 9 రోజుల్లోనే 30 దేశాలకు..

మరిన్ని వార్తలు