Omicron Variant-Night Curfew: ఒమిక్రాన్‌ భయాలు.. రాత్రి కర్ఫ్యూ విధించిన మరో రాష్ట్రం

24 Dec, 2021 11:50 IST|Sakshi

Night Curfew In Uttar Pradesh: ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. శనివారం రాత్రి నుంచి ఆంక్షలు అమలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. యూపీలో ప్రస్తుతం 2 ఒమిక్రాన్‌ కేసులున్నాయి. మధ్యప్రదేశ్‌ కూడా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది.

ఇక ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కోవిడ్‌ కాలంలో అనుసరించాల్సిన విధానాలు (కోవిడ్‌ అప్రాప్రియేట్‌ బిహేవియర్‌– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని  మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.
(చదవండి: ‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు)

పండగ సీజన్ల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించొచ్చని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కేసుల పాజిటివిటీ రేటును, డబ్లింగ్‌ రేటును జిల్లాల వారీగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పింది. అలాగే 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
(చదవండి: Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ)

>
మరిన్ని వార్తలు