మోదీ జీ.. సీఎం సతీమణి అవినీతి మీకు కనిపించదా..?

5 Jun, 2022 08:58 IST|Sakshi

సాక్షి, న్యూఢ్లిలీ: ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతల అవినీతి కనిపించడం లేదా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా శనివారం ప్రశ్నించారు. బీజేపీ నేతల అవినీతిని బయట పెడతానంటూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేసిన కాసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. 

బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్యకు చెందిన కంపెనీలకు అక్రమంగా పీపీఈ కిట్ల కాంట్రాక్ట్‌ కట్టబెట్టారని ఆరోపించారు. ‘‘పైగా ఒక్కో కిట్‌ను అసోం ప్రభుత్వం రూ.600కి కొంటుంటే భార్య కంపెనీకి రూ.990 చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్‌ ఇచ్చారు. తర్వాత దాన్ని రద్దు చేసి, కుమారుడు భాగస్వామిగా ఉన్న మరో కంపెనీకి ఒక్కో కిట్‌కు రూ.1,680 చెల్లించేలా కాంట్రాక్ట్‌ అప్పగించారు. ఇది అవినీతి కాదా?’’ అని ప్రశ్నించారు. వీటిపై హిమంత స్పందించారు. సిసోడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా.. ఎప్పుడో ఏడేండ్ల కిందటి కేసును తిరగదోడి ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను ఆగమేఘాలపై ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. ఇక ‘పీపీఈ కిట్ల’ స్కామ్‌లో బిశ్వశర్మపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విపక్ష పార్టీలు మండిపడ్డాయి. పీపీఈ కిట్ల స్కామ్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఇక, 2020లో జరిగిన ఈ స్కామ్‌ సమాచార హక్కు చట్టం ద్వారా ఇటీవల వెలుగుచూసింది. అప్పుడు బిశ్వశర్మ ఆరోగ్యమంత్రిగా కొనసాగారు. 

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది.. జై షా చక్రం తిప్పాడు..: బీజేపీ నేత కామెం‍ట్స్‌

మరిన్ని వార్తలు