అగ్నిపథ్‌ ఆందోళనలతో నిలిచిన రైలు.. సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి

18 Jun, 2022 15:41 IST|Sakshi

సాక్షి, విజయనగరం: త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసింది. ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన అల్లర్లు రూ.కోట్లలో ఆస్తినష్టాన్ని మిగల్చడమే కాకుండా పలుచోట్ల ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి.  అగ్నిపథ్‌ ఆందోళన నేపథ్యంలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేయడంతో ఓ  వ్యక్తి మృతి చెందాడు. గుండె జబ్బు చికిత్స కోసం ఒడిశా నుంచి వస్తున్న జోగేష్‌ బెహరా(70) అనే వృద్ధుడు మృతి చెందాడు.


విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

బెహరా కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖకు అతని కుటుంబ సభ్యులు కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌‌‌లో బయల్దేరారు. అయితే అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలును అధికారులు కొత్తవలసలోనే నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. సమయానికి వైద్యం అందకనే జోగేష్‌ మృతిచెందాడని బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
చదవండి: అగ్నిపథ్‌ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

మరిన్ని వార్తలు