అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. నిందితుడికి బెయిల్‌

9 Jan, 2023 14:43 IST|Sakshi

భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని స్పష్టం చేసింది.

ఏంటీ కేసు..?
నిమపారకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. భువనేశ్వర్ తీసుకెళ్లి ఆమెతో కొన్ని రోజులు సహజీవనం చేశాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఆమెను వదిలి పారిపోయాడు.

దీంతో మహిళ అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడు జిల్లా కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే న్యాయస్థానం నిరాకరించింది. అయితే అతడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసిందున దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం చెప్పింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే మహిళను బెదిరించవద్దని అతన్ని ఆదేశించింది. కేసు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది.
చదవండి: విమానంలో మందుబాబుల హల్‌చల్‌.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా..

మరిన్ని వార్తలు