వైరల్‌: భల్లుకాల బంతాట.. అభిమానులుగా మారిన నెటిజన్స్‌

13 Sep, 2021 15:33 IST|Sakshi

భువనేశ్వర్‌: ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశిస్తే.. ప్రజలు భయంతో పరుగులు తీయడం పరిపాటి. అంతేకాకుండా అవి మనుషులపై దాడులు చేస్తూ ప్రాణాలను తీస్తున్న ఘటనలు కూడా అనేకం. అయితే రెండు భల్లూకాలు క్రీడా మైదానానికి వచ్చి, క్రీడాకారులు ఆడుతున్న ఫుట్‌బాల్‌ బంతిని తీసుకుపోవడంతో పాటు దానితో ఆడుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. నవరంగపూర్‌ జిల్లా ఉమ్మరకోట్‌ సమితి మృత్తిమా పంచాయతీ శుఖిగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం శుఖిగాం గ్రామానికి చెందిన చిన్నారులు స్థానిక క్రీడా మైదానంలో ఎప్పటిలాగే ఫుట్‌బాల్‌ ఆడేందుకు వెళ్లారు. వారంతా ఆటలో నిమగ్నమై ఉండగా.. సమపంలోని అడవిలో నుంచి అకస్మాత్తుగా రెండు ఎలుగుబంట్లు మైదానంలోకి ప్రవేశించాయి.

వాటిని చూసిన చిన్నారులు భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. అయితే రెండు భల్లూకాలు మాత్రం బంతితో ఫుట్‌బాల్‌ ఆడటం ప్రారంభించాయి. ఇదంతా గమనించిన స్థానికులు.. ఈ దృష్టాలను సెల్‌ఫోన్లలో బంధించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీటి ఆటను చూసిన వారంతా ఫుట్‌బాల్‌ ఆటకు ఎవరైనా అభిమానులు కావాల్సిందే అనుకొంటూ మజా చేస్తున్నారు. 

చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్‌ విలువను బట్టే పెళ్లి భోజనం

మరిన్ని వార్తలు