సాక్షి, నవరంగపూర్( భువనేశ్వర్): కొంతమంది కళాకారులు తమ చేతి నైపుణ్యం, పనితనంతో చిత్రాలకు ప్రాణం పోస్తారంటారు. ఇలాంటి అనుభూతి కొన్ని సందర్భాల్లోనే మనకి కలుగుతుంది. ప్రస్తుతం ఓ గోడ మీద వేసిన బొమ్మను చూసి ఇలాంటి అనుభూతి కలిగిందని అంటున్నారు ఓ ప్రాంత ప్రజలు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లా కలెక్టరేట్ ప్రహరీగోడపై వేసిన రైలు బొమ్మ నగరవాసులను ఇట్టే ఆకట్టుకుంది.
అచ్ఛం రైలుబండి లాగానే వేసిన పెయింటింగ్ అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ ఎలా ఉందంటే.. దూరం నుంచి చూసిన వారికి... నవరంగపూర్కు రైలు ఎప్పుడు వచ్చిందోనని ఆశ్చర్యం కలగక మానదు. తీరా దగ్గరకు వచ్చి చూడగా, అది రైలుకాదని కేవలం చిత్రమని తెలిసి చాలమంది అచ్చెరువొందారు. శుక్రవారం నగరవాసులు రైలుబొమ్మతో సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది.