బెంగళూరులో ఆక్సిజన్‌ కొరత: 24 మంది మృతి

3 May, 2021 13:25 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌తో దేశంలో కరోనా బాధితులు ఆక్సిజన్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత వల్ల కోవిడ్‌ పేషెంట్లు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా కర్ణాటకలో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 24 మంది మృతి చెందారు. చామరాజనగర్‌లో ఉన్న కోవిడ్‌ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

మృతి చెందిన కోవిడ్‌ బాధితులంతా ఆక్సిజన్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతోనే వారు మరణించారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రి అధికారులు ఈ ఘటనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.  ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్‌ తెప్పించినట్లు ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మృతి చెందిన వారి పోస్టుమార్టం నివేదికలు వస్తే బయటపడతాయని అన్నారు.

కాగా మృతి చెందిన రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, అదీకాక వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.ఆర్‌.రవి వెల్లడించారు. వారు కచ్చితంగా ఆక్సిజన్‌ కొరతతో మరణించారా లేదా అన్న అంశం తేలాల్సి ఉందన్నారు. ఈ  విషాద ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప.. చామరాజనగర్‌ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చదవండి: Corona Cases in India: కరోనా విస్ఫోటం

మరిన్ని వార్తలు