ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

28 Apr, 2021 14:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆక్సిజన్‌ బ్లాక్‌మార్కెట్లో అమ్మడంపై ఢిల్లీ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితిని చక్కదిద్దలేకపోతే గ్యాస్‌ రీఫిల్లర్‌ యూనిట్లను కేంద్రం స్వాధీనంలోకి పంపుతామని, అంతేకానీ ప్రజలు చచ్చిపోతుంటే చూస్తూ కూర్చోలేమని హెచ్చరించింది. మూడు గంటల పాటు జరిగిన విచారణలో సమస్యంతా ఢిల్లీ ప్రభుత్వం వల్లనే వస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. రీఫిల్లింగ్‌ యూనిట్లను టేకోవర్‌ చేయాలని, ఆస్పత్రులకు కొరత లేకుండా ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఆదేశించింది.

మరోవైపు అశోకా హోటల్‌లో హైకోర్టు జడ్జిలు, సిబ్బంది కోసం వందరూములతో కోవిడ్‌ కేర్‌ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇలాంటి సదుపాయాన్ని తాము కోరలేదని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. ఈ ఆదేశాలు ముఖ్యమంత్రికి, కేబినెట్‌ మంత్రులకు తెలియకుండా వచ్చాయని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఆదేశాలు తప్పని, ఇలాంటివి ప్రభుత్వానికి మేలు చేసినందుకు జడ్జిలకు సమకూరాయన్న తప్పుడు సందేశాన్నిస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది.

చదవండి: 

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కుటుంబాల పొదుపు.. ఎంతంటే?

మరిన్ని వార్తలు