ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఫైర్‌

1 Sep, 2020 17:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది... ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడు పి. చిదబంరం మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. ‘దేవుడిని నిందించవద్దు. నిజానికి మీరు దైవానికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు రైతులను ఆశీర్వదించాడు. మహమ్మారి ప్రకృతి విపత్తు. కానీ మీరు వైరస్‌ను మానవ నిర్మిత విపత్తుతో కలిపేస్తున్నారు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా వర్ణించారు చిదంబరం. కరోనా వైరస్ మహమ్మారి కార‌ణంగా నెల‌కొన్న ఆర్థిక కొర‌త నేప‌థ్యంలో ప‌రిహారం కోరుతూ రాష్ర్టాలు డిమాండ్ చేశాయి. ఈ నేప‌థ్యంలో 41వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. (చదవండి: 2020–21లో ఆర్థిక వ్యవస్థ క్షీణత)

కరోనా వైరస్‌ దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని, ఈ ప్రకృతి చర్యతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 2020–21లో రాష్ట్రాలు జీఎస్‌టీ ఆదాయాల రూపంలో రూ.2.35 లక్షల లోటును ఎదుర్కోవచ్చని కేంద్రం అంచనా వేసింది.

మరిన్ని వార్తలు