భారత్‌ కన్నాపాక్‌ వద్దే ఎక్కువ అణ్వస్త్రాలు! 

16 Jun, 2021 04:35 IST|Sakshi

వెల్లడించిన సిప్రి నివేదిక  

న్యూఢిల్లీ: న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ లెక్కలో మనకన్నా చైనా, పాకిస్థాన్‌ ముందంజలో ఉన్నాయని సిప్రి(స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి చైనా వద్ద 350, పాక్‌ వద్ద 165 అణ్వాస్త్రాలుండగా, భారత్‌ వద్ద 156 అణ్వాస్త్రాలున్నాయని తెలిపింది. మూడు దేశాలు తమ అణ్వస్త్ర సామర్ధ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నాయని వివరించింది. గతేడాది జనవరిలో చైనా, పాక్, భారత్‌ వద్ద వరుసగా 320, 160, 150 న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ ఉన్నాయి. వీటిలో చైనా అణ్వాస్త్రాల ఆధునీకరణ, పెంపుదలలో ముందువరుసలో ఉందని నివేదిక తెలిపింది.  

సిప్రి ఇయర్‌ బుక్‌ 2021 ముఖ్యాంశాలు 
► ప్రపంచంలో ప్రస్తుతం 9 దేశాలకు అణ్వస్త్ర సామర్ధ్యం ఉంది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తరకొరియాల వద్ద అణ్వాయుధాలున్నాయి.  
► ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలు దాదాపు 13,080 కాగా, వీటిలో 90 శాతం పైగా అణ్వాయుధాలు అమెరికా, రష్యా వద్దనే ఉన్నాయి. 
► అణ్వాయుధాల తయారీకి అవసరమైన ముడి పదార్ధంను ఫిస్సైల్‌ మెటీరియల్‌ అంటారు. అత్యంత శుద్ధిచేసిన యురేనియం లేదా సెపరేటెడ్‌ ప్లుటోనియంను మిస్సైల్‌ మెటీరియల్‌గా వాడతారు.  
► ఇండియా, ఇజ్రాయెల్‌ ఎక్కువగా ప్లుటోనియంను ఉత్పత్తి చేస్తుండగా, పాకిస్తాన్‌ యురేనియం ఉత్పత్తి చేసుకుంటూ ప్లుటోనియం ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే పనిలో ఉంది. 
► చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్‌లు రెండు రకాల మిస్సైల్‌ మెటీరియల్‌ను ఉత్పత్తి చేయగలవు. 
► 13,080 అణ్వాయుధాల్లో సుమారు 2వేల అణ్వాయుధాలు వెనువెంటనే వాడేందుకు తయారుగా ఉండే స్థితిలో ఉన్నాయి.  
► 2016–20 మధ్య కాలంలోమొత్తం ఆయుధాల దిగుమతుల పరంగా చూస్తే సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్టు, ఆస్ట్రేలియా, చైనాలు టాప్‌ 5 దిగుమతిదారులుగా ఉన్నాయి.  
► ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో సౌదీ వాటా 11 శాతం కాగా, భారత్‌ వాటా 9.5 శాతం.  

మరిన్ని వార్తలు