వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్ల రుణం ప్లీజ్‌!

2 Oct, 2022 08:20 IST|Sakshi
నిర్మలా సీతారామన్‌తో పళణి వేల్‌ త్యాగరాజన్‌

సాక్షి, చెన్నై: తమిళనాడుకు వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్లు రుణం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర మంత్రి పళణి వేల్‌ త్యాగరాజన్‌ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి పళణి వేల్‌ వెళ్లారు. పార్లమెంట్‌ హాల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె చాంబర్‌లో కలిశారు.

తమిళనాడుకు రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. అలాగే, వడ్డీ లేని రుణం, జీఎస్టీ నిల్వ తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని, తమిళనాడులో సాగుతున్న ప్రాజెక్టులతో వినతి పత్రాన్ని, నివేదికను ఆమెకు అందజేశారు. అనంతరం వెలుపల మీడియాతో పళణి వేల్‌ త్యాగరాజన్‌ మాట్లాడారు. తమిళనాడుకు సంబంధించి అనేక అంశాలు, ప్రాజెక్టులపై పూర్తిస్థాయి నివేదికను అందించినట్లు తెలిపారు.

చదవండి: (భిక్షగాడిగా మారిన మాజీ వ్యవసాయ అధికారి దీనగాథ.. 26 ఏళ్ల తరువాత న్యాయం)

మదురైలో జీఎస్టీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. చెన్నైలో జరుగుతున్న రెండో విడత మెట్రో పథకం కోసం రుణపత్రాలకు ఆమోదం ఇవ్వాలని కోరామని చెప్పారు. వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్ల మేర రుణం ఇవ్వాలని కోరామని, దీనిపై నిర్మాలా సీతారామన్‌ సానుకూలంగా స్పందించాలని వెల్లడించారు.

అలాగే, తమ విజ్ఞప్తి మేరకు ఆప్టిక్‌ కేబుల్‌ పనులకు రూ. 184 కోట్లు, గ్రామీణాభివృద్ధి, రహదారుల పనులకు రూ.3,263 కోట్లు విడుదల చేశారని తెలిపారు. అలాగే, ఐటీ ఈపీఎఫ్‌ఓలకు డేటా విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించారు. మదురైలో నైబర్‌ పథకం గురించి ప్రస్తావించగా, దానిని కేంద్రం పక్కన పెట్టినట్టు మంత్రి వివరణ ఇచ్చారని పళణివేల్‌ త్యాగరాజన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు