ఆధార్‌తో లింకేజీ లేకుంటే పాన్‌కార్డు నిష్ఫలమే

25 Dec, 2022 08:39 IST|Sakshi

ఆదాయ పన్ను శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31వ తేదీనాటికి ఆధార్‌తో అనుసంధానంకాని పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌(పాన్‌) కార్డులు క్రియాశీలకంగా ఉండబోవని ఆదాయ పన్ను శాఖ ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొంది. ‘ఆదాయపన్ను చట్టం–1961 ప్రకారం ఎలాంటి మినహాయింపుల పరిధిలోకిరాని పాన్‌ కార్డు వినియోగదారులు తమ కార్డును ఆధార్‌తో వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్‌తో అనుసంధానించని పాన్‌ కార్డులు ఏప్రిల్‌ ఒకటోతేదీ నుంచి మనుగడలో ఉండవు. వాటిని ఇన్‌ఆపరేటివ్‌గా భావించాలి’ అని ఐటీ శాఖ ఆ బహిరంగ ప్రకటనలో స్పష్టంచేసింది.

పాన్‌ కార్డు మనుగడలో లేకపోతే ఐటీ చట్టం ప్రకారం సంబంధిత కార్డు హోల్డర్‌ చట్టపరంగా పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మార్చి 30న ఒక సర్క్యులర్‌లో పేర్కొనడం తెల్సిందే. క్రియాశీలకంగాలేని పాన్‌ కార్డుతో ఐటీ రిటర్న్‌లు దాఖలుచేయడం వీలుకాదు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు తిరిగిరావు. కట్టాల్సిన పన్నులకు మించి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) తప్పనిసరి అయిన బ్యాంక్‌లు, ఆర్థిక సంబంధ వెబ్‌సైట్లలో పాన్‌కార్డు ఖచ్చితం చేసిన నేపథ్యంలో ఇకపై వారు వాటి ద్వారా నగదు బదిలీ, ఆర్థిక లావాదేవీలు జరపడం దాదాపు అసాధ్యం. సాధారణంగా ఐటీ శాఖకు సంబంధించిన విధానపర నిర్ణయాలను సీబీడీటీనే నిర్ణయిస్తుంది.  2017 మే నెలలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక నోటిఫికేషన్‌లో ఆ ‘మినహాయింపు కేటగి రీ’ని పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్, మేఘాల యలో ఉండేవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ చట్టం–1961 ప్రకారం స్థానికే తరులు, 80 ఏళ్లు దాటిన వారు, భారతపౌరులు కాని వారికి ఈ మినహాయింపు ఉంది.

మరిన్ని వార్తలు