వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా

2 Dec, 2022 05:42 IST|Sakshi

మా పిల్లలు వీటికి అతుక్కుపోయారు

పట్టణాల్లోని తల్లిదండ్రుల ఆవేదన

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఆటలు, సామాజిక మాధ్యమాలు, వీడియోల వ్యసనం పిల్లలకు బాగా ఎక్కువైందని పట్టణప్రాంతాల్లోని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా సర్వేలు నిర్వహించే ‘లోకల్‌సర్కిల్స్‌’ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరి–నవంబర్‌ కాలంలో దేశవ్యాప్తంగా 287 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. సర్వే ఫలితాల ప్రకారం..

► తమ 9–17 ఏళ్ల వయసు పిల్లలు గేమింగ్, వీడియోలు, సోషల్‌మీడియాకు అతుక్కుపోయారని పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రుల్లో దాదాపు 40 శాతం మంది అభిప్రాయపడ్డారు.
► తమ 13–17 వయసు పిల్లలు రోజూ సగటున 3 గంటలకుపైగా ఇదే పనిలో ఉంటున్నారని 62 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు
► 9–13 వయసు చిన్నారులు రోజూ కనీసం మూడు గంటలు సోషల్‌ మీడియా, వీడియోలు, గేమింగ్‌తోనూ గడుపుతున్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు
► సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఖాతాలు ఓపెన్‌ చేయాలంటే కనీసం 13 ఏళ్లు వయసుండాలని ఆయా సంస్థలు చెబుతున్నాయి. కానీ, 13 ఏళ్లలోపే అంటే 9–13 ఏళ్ల తమ పిల్లలు వీటిని చూస్తున్నారని 47 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు
► పట్టణప్రాంతాల్లోని 13–17 వయసు పిల్లల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ ఉందని 44 శాతం మంది పేరెంట్స్‌ అభిప్రాయపడ్డారు
► సోషల్‌మీడియా ఖాతా తెరిచేందుకు కనీస వయసును 13 ఏళ్లకు బదులు 15 ఏళ్లుగా సవరించాలని 68 శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
► ఆన్‌లైన్‌ తరగతులు, కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు వినోదం కోసం కోవిడ్‌ తర్వాత ఇంటర్నెట్‌ను వాడుతున్న పట్టణప్రాంత చిన్నారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

మరిన్ని వార్తలు