కరోనా నుంచి ఎంపీల రక్షణకు ఎన్నో చర్యలు

14 Sep, 2020 15:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత పార్లమెంట్‌ సమావేశాలు గత మార్చి 23వ తేదీతో ముగిశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ ఓ పక్క విజృంభిస్తుంటే మరోపక్క దేశ ఆర్థిక పరిస్థితి మున్నెన్నడు లేని విధంగా దిగజారుతూ వచ్చింది. ఇంకో పక్క చైనా యుద్ధానికి కాలు దువ్వుతూ సరిహద్దులో అలజడి సృష్టిస్తోంది. ఈ మూడు ప్రధాన అంశాల గురించి చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల గురించి ప్రతిపక్ష పార్టీలు గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నప్పటి బీజేపీ పాలక పక్షం పెడ చెవిన పెడుతూ వచ్చింది. చివరకు సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధంగా ఇరు పార్లమెంట్‌ సమావేశాల మధ్య గరిష్టంగా ఆరు నెలలకు మించి వ్యవధి ఉండరాదనే నిబంధనను కూడా పాటించినట్లయింది. ఆలస్యంగా ప్రారంభమైన ఈ వర్షాకాల సమావేశాలను అసాధారణ సమావేశాలుగానే పేర్కొనవచ్చు.

లోక్‌సభ, రాజ్యసభ షిప్టుల పద్ధతిలో సమావేశమవుతాయి. ఇరు సభల గదులను, సందర్శకుల గ్యాలరీలను పార్లమెంట్‌ ఎంపీలు, సిబ్బంది భౌతిక దూరం పాటించేందుకు ఉపయోగిస్తున్నారు. ఎంపీలు, సిబ్బందితోపాటు జర్నలిస్టులు సుమారు నాలుగు వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంపీలు, మంత్రులను మాత్రమే ప్రధాన భవనంలోకి అనుమతిస్తున్నారు. వారి సిబ్బంది ప్రత్యేకంగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంపీలు తమతమ స్థానాల్లో కూర్చునే మాస్కులు ధరించే సభాధ్యక్షులతో మాట్లాడేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రతి ఎంపీకి డీఆర్‌డీవో బహుళ ప్రయోజనకర ప్రత్యేక కోవిడ్‌–19 కిట్స్‌ను అందజేసింది. ప్రతి కిట్‌లో 40 డిస్పోజబుల్‌ మాస్కులు, ఐదు ఎన్‌ 95 మాస్క్‌లు, బాటిల్‌ 50 ఎంఎల్‌ శానిటైజర్లు కలిగిన 20 బాటిళ్లు, 40 జతల చేతి గ్లౌజులు, కొన్ని ఫేస్‌ మాస్క్‌లు, ఔషధ మొక్కలతో తయారు చేసిన తుడుచుకునే పేపర్లు, శక్తిని పెంచే టీ పొట్లాలు ఉన్నాయి. కోవిడ్‌ నుంచి ఎంపీలకు రక్షణ కల్పించేందుకు చివరికి పార్లమంట్‌ సమావేశాలకు అతిముఖ్యమైన ‘ప్రశ్నోత్తరాల’ కార్యక్రమంలో మార్పులు చేశారు. (17 మంది ఎంపీలకు కరోనా)

మరిన్ని వార్తలు