Parliament Live Updates: బాయిల్డ్‌ రైస్‌ సరఫరా చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం: పీయుష్‌ గోయల్‌

8 Dec, 2021 11:19 IST|Sakshi

11.55 AM

► సభలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్‌ కుమార్‌ లేవనెత్తిన అంశం ప్రస్తుతం నడుస్తున్న..  చర్చకు సంబంధంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనాల్సిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.. కేంద్రానికి సంబంధం లేదని పీయుష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. బాయిల్ఢ్‌ రైస్‌ సరఫరా చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని పీయుష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

11.25 AM

ధాన్యం  కొనుగోలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ సభలోకి వచ్చి డ్రామా చేసిందన్నారు. 

11.15 AM

► రైతులకు కనీసమద్దతు ధర కల్పించే విషయంలో సంబంధిత భాగస్వామ్య పార్టీలతో చర్చించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వం మూడు సాగుచట్టాలను రద్దుచేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రస్తుతం.. దేశంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుందన్నారు. 

అదే విధంగా.. కనీస మద్దతు ధర కల్పించాలనే అంశం చర్చకు వస్తుందన్నారు. కాగా, తమ ప్రభుత్వం ఏపీ రైతులకు కనీస మద్దతు ధర ఆచరించి చూపిందని తెలిపారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తే.. తమ ప్రభుత్వం మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్‌పీ ప్రకటించిందన్నారు. ప్రస్తుతం ఏపీలో 47 పంటలకు కనీస మద్దతుధర కల్పిస్తోందని పేర్కొన్నారు.

10.55 AM

► ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో ప్రత్యేక హల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రహ్లద్‌ జోషి, నిర్మలా సీతారామన్‌ తదితరులు హజరయ్యారు. 

10.45 AM

► నాగాలాండ్‌ పౌరుల మృతిపై చర్చించేందుకు నాగా పీపుల్స్‌ ఎంపీ కేజీ కెన్యె  రాజ్యసభలో నోటీసులు జారీచేశారు. వివాదాస్పద సైనిక చట్టాన్ని రద్దుచేయాలని కోరారు. 

10.40 AM

► చైనా, భూటాన్‌ సరిహద్దు సమస్యలపై చర్చించాలని కోరుతూ  కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.

10.35 AM

► రైతుల సమస్యలపై రాజ్యసభలో చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ సింగ్‌ హుడా డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర కల్పించాలని, బాధిత రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రైతులపై ఉన్న కేసులను కొట్టివేయాలని కోరుతూ.. ఎంపీ దీపేందర్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. 

10.30 AM

► మోదీ ప్రభుత్వం రైతులు, సామాన్య ప్రజలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. నిత్యావసరాల ధరలు పెరుగుదలతో ప్రతి కుటుంబం విలవిల్లాడుతుందన్నారు. రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలకు పరిహరం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా సస్పెండ్‌ అయిన 12 మంది ఎంపీలకు సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. 
 

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం సభ ప్రారంభమయ్యింది. 

మరిన్ని వార్తలు