ఇవెక్కడి పోలీస్​ స్టేషన్లు.. బండ్లు లేవ్​.. ఫోన్లు అసలే లేవు!! పీఎస్సీ నివేదికలో విస్తుపోయే వివరాలు

11 Feb, 2022 09:04 IST|Sakshi
పోలీస్​ స్టేషన్​ ప్రతీకాత్మక చిత్రం

అంతా టెక్నాలజీమయం. వర్చువల్​ ట్రెండ్​ నడుస్తోంది ఇప్పుడు. నేరాలు ఎంత టెక్నిక్​తో జరుగుతున్నాయో.. అంతే కౌంటర్​ టెక్నాలజీతో వాటిని చేధిస్తున్నారు పోలీసులు. కీలకమైన పోలీసింగ్​ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సూపర్​, ఫ్రెండ్లీ పోలీసింగ్​ అంటూ ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ,  ఆ వ్యవస్థను పటిష్టపరిచే అంశంపై మాత్రం పూర్తి దృష్టి పెట్టడం లేదన్న విషయం తెలుసా?. దేశంలో పోలీసు వ్యవస్థ దీనస్థితిని పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ(పీఎస్సీ) నివేదిక వెల్లడించింది తాజాగా..

కాంగ్రెస్​ నేత ఆనంద్​ శర్మ నేతృత్వంలో పార్లమెంట్​ స్టాండింగ్​ కమిటీ (PSC) ఈ నివేదిక రూపొందించింది. తాజాగా ఈ కమిటీ హోం వ్యవహారాల శాఖకు సమర్పించిన నివేదికలో.. దేశంలో 257 పోలీస్​ స్టేషన్లకు ఇప్పటివరకు వాహనాలే లేవట. మరో 638 పోలీస్​ స్టేషన్లకు కనీసం టెలిఫోన్​ సౌకర్యం కూడా లేదు. ఇక 143 పోలీస్​ స్టేషన్లకు వైర్​లెస్​, సెల్​ఫోన్​ లాంటి సౌకర్యాలు లేవని ఈ​ కమిటీ వెల్లడించింది. పనిలో పనిగా మోడ్రన్​ పోలీసింగ్​ వ్యవస్థకు బలమైన కమ్యూనికేషన్​ వ్యవస్థ అవసరమని, త్వరగతిన స్పందన కోసం వాహన వ్యవస్థ సమకూరాలని, అత్యాధునిక ఆయుధాల అవసరమూ ఉందని ఈ కమిటీ అభిప్రాయపడింది.

21వ శతాబ్దంలో అరుణాచల్​ ప్రదేశ్​, ఒడిశా, పంజాబ్​ లాంటి రాష్ట్రాల్లో కమ్యూనికేషన్​ బలంగా లేకపోవడం మంచిది కాదు, ఆయా రాష్ట్రాలకు ఇం​సెన్సిటివ్స్​ జారీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే జమ్ము కశ్మీర్​ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో వైర్​ లెస్​ సేవల కొరత మంచిది కాదని తెలిపింది.  ఇక పలు రాష్ట్రాల విషయంలో హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖకు కీలక సూచనలు చేసిన ఈ కమిటీ.. కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో అవసరమైన చర్యలు త్వరగతిన చేపట్టాలని కోరింది. లా అండ్​ ఆర్డర్​ పరిరక్షించే క్రమంలో సిబ్బందికి గాయాలు కాకుండా ఉండేందుకు రక్షణ కవచాల ఆవశ్యకతను కమిటీ గుర్తు చేసింది. అంతేకాదు ఆయా పోలీస్​ స్టేషన్ల తీరుతో జనాలు.. పొరుగు ప్రాంతాల స్టేషన్లను ఆశ్రయిస్తున్నారంటూ ఆసక్తికర అంశాన్ని సైతం ప్రస్తావించింది కమిటీ.   

మొత్తం దేశంలోని 16, 833 పోలీస్​ స్టేషన్​లను పరిశీలించి.. జనవరి 1, 2020 నాటి పరిస్థితుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఈ కమిటీ. అయితే ఈ పరిస్థితుల్లో ఈనాటికీ పెద్దగా మార్పు రాలేదని కమిటీ పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు