ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం

29 Oct, 2020 06:20 IST|Sakshi

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ తన లొకేషన్‌ సెట్టింగ్‌లలో లద్దాఖ్‌లోని లేహ్‌ ప్రాంతాన్ని చైనాలో అంతర్భాగంగా చూపించడంపై ఇచ్చిన వివరణ సరిగా లేదని పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో బుధవారం ట్విట్టర్‌ అధికారుల్ని ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ లేహ్‌ ప్రాంతాన్ని అలా చూపించడం దేశ ద్రోహం కిందకి వస్తుందని తెలిపింది. డేటా ప్రొటెక్షన్‌ బిల్లు పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ట్విట్టర్‌ అధికారుల్ని కమిటీ సభ్యులు దాదా పుగా రెండు గంటల సేపు ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన సున్నితమైన ఈ అంశాన్ని తాము గౌరవిస్తామని ట్విట్టర్‌ అధికారులు తెలిపారు. తాము చేసిన పొరపాటుకు క్షమాపణ కూడా కోరారు.ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించామని అన్నారు. తమ సంస్థ అత్యంత పారదర్శకంగా పని చేస్తుందని, ఎప్పటికప్పుడు కేంద్రానికి తాము సరి చేసిన అంశాలను తెలియజెప్పామన్నారు.

>
మరిన్ని వార్తలు