Partha Chatterjee: ‘ఆ డబ్బులు నావి కావు.. కాలమే సమాధానం చెబుతుంది’

31 Jul, 2022 13:48 IST|Sakshi

కోల్‌కతా: ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ తనపై వచ్చిన ఆరోపణలను మరోమారు తోసిపుచ్చారు. తన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ నివాసంలో దొరికిన డబ్బుల కట్టలు తనవి కావని పేర్కొన్నారు. తాను అరెస్టయిన తర్వాత కుట్ర జరిగిందని ఆరోపించారు. వైద్య పరీక్షల కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రికి తీసుకెళ్లిన క్రమంలో మీడియాతో మాట్లాడారు పార్థా ఛటర్జీ. ‘సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఆ డబ్బులు నావి కావు.’ అని పేర్కొన్నారు. 

టీచర్‌ నియామకాల్లో అవకతవకలపై మాజీ మంత్రి సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. మూడు ఇళ్లల్లో సుమారు రూ.52 కోట్లు, విలువైన ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకుంది. అనంతరం విచారించగా.. ఆ డబ్బంతా మంత్రిదేనని, తన ఇంట్లోని గదులను ఉపయోగించుకునే వారని ఈడీకి చెప్పారు. ఆ గదుల్లోకి తాను సైతం వెళ్లేందుకు అనుమతించేవారు కాదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు

మరిన్ని వార్తలు