పతాంజలి సునీల్‌ మృతి.. మా మందులు వాడలేదు!

25 May, 2021 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ: అల్లోపతి ఓ పిచ్చిసైన్స్‌ అనే కామెంట్ల వీడియోతో దుమారం రేపిన రాందేవ్‌ బాబా.. ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ నోటీసులతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డెయిరీ వైస్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ బన్సాల్‌ కరోనాతో చనిపోవడంతో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్‌కి జరిగిన కొవిడ్‌-19 ట్రీట్‌మెంట్‌లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. 

యాభై ఏడేళ్ల వయసున్న సునీల్‌ బన్సాల్‌ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో సునీల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్‌ ఆరోగ్య విభాగంలో సీనియర్‌ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్‌మెంట్‌ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్‌ ట్రీట్‌మెంట్‌లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం’’ అని స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది రాజస్థాన్‌ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్‌ వేసినట్లయ్యింది. 

లక్ష కరోనిల్‌
బాబా రాందేవ్‌-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం లక్ష పతాంజలి కరోనిల్‌ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్‌ విజ్‌ ప్రకటించాడు. ఇందుకోసం స‌గం ఖ‌ర్చును పతాంజలి సంస్థ భ‌రిస్తుంద‌ని, మ‌రో స‌గం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంద‌ని మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు