రికార్డు సృష్టించిన ‘కరోనిల్‌ కిట్‌’....

2 Nov, 2020 14:06 IST|Sakshi

దేశ విదేశాల్లో 25 లక్షల కిట్లు అమ్మకం

నాలుగు నెలల్లో రూ. 250 కోట్ల అమ్మకాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణ ఔషధం పేరుతో పతంజలి విడుదల చేసిన ‘కరోనిల్‌ కిట్‌’పై ఎంత దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కిట్‌లో "దివ్య స్వసరి వతి", "దివ్య కొరోనిల్ టాబ్లెట్", "దివ్య అను తైల్" అనే ఔషధాలుంటాయి. అయితే తొలుత దీన్ని కరోనాని తగ్గించే మందుగా.. ఆ తర్వాత నివారణ ఔషధంగా పేర్కొన్నారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పతంజలి కంపెనీకి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికి జనాలు మాత్రం ‘కరోనిల్‌ కిట్‌’ని బాగానే వాడారు.

నాలుగు నెలల వ్యవధిలోనే ఈ కిట్‌ 250 కోట్ల రూపాయల బిజినేస్‌ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఈ కిట్‌ని అమ్మినట్లు తెలిపింది. అక్టోబర్‌ 18 వరకు పతంజలి ఆయుర్వేద కంపెనీ దాదాపు 2.5 మిలియన్ల కరోనిల్‌ కిట్లను అమ్మిందని.. వీటి విలువ సుమారు 250 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. ఇండియాతో పాటు విదేశాల్లో ఆన్‌లైన్‌, పతంజలి స్టోర్‌లు, డైరెక్ట్‌ మార్కెటింగ్‌, మెడికల్‌ షాపుల ద్వారా 25మిలియన్ల కిట్లు అమ్మినట్లు తెలిపింది. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు)

ఇక ‘కరోనిల్‌ కిట్‌’ని ఈ ఏడాది జూన్‌ 23న లాంచ్‌ చేసింది. ఈ ఉత్పత్తి కరోనా వైరస్‌ని తగ్గిస్తుందని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఇక కరోనిల్‌ లాంచ్‌తో దేశవ్యాప్తంగా వివాదం రేగడంతో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఈ కిట్‌ ట్రయల్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు అందిచాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ‘కరోనిల్‌ కిట్’‌.. కోవిడ్‌కి ఔషధం అంటూ ఇచ్చిన ప్రకటనలను కూడా బ్యాన్‌ చేసింది. అమ్మకాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో పతంజలి కరోనిల్‌ గురించి చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకున్నారు. ఇది కరోనాని తగ్గించదని.. కేవలం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఈ ప్రకటన తర్వాత ఆయూష్‌ మంత్రిత్వ శాఖ రోగనిరోధక శక్తి పెంచే కిట్‌గా కరోనిల్‌ అమ్మకాలకు అనుమతిచ్చారు. దాంతో గత నాలుగు నెలల్లో కరోనిల్‌ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 250 కోట్ల రూపాయలు విలువ చేసే 25 కిట్లను అమ్మినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు