Patna Girl Sreeja: బంగారు తల్లి శ్రీజ గెలుపు.. ఆ కర్కశ తండ్రికి కనువిప్పు!

25 Jul, 2022 13:07 IST|Sakshi

ఏ తల్లిదండ్రులకైనా కన్నబిడ్డల విజయం అనేది ఒక కల.. అది అందుకున్న వేళ మధుర క్షణంగా మిగిలిపోతుంది కూడా. కానీ, ఆ తండ్రికి మాత్రం అదొక కనువిప్పు.. అలాంటి తండ్రులకు ఓ మంచి గుణపాఠం. కారణం.. పసికందుగా ఉన్నప్పుడే ఆమెను నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయాడు కాబట్టి.   

తాజాగా సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో 99.4 శాతం మార్కులు సంపాదించుకుంది బీహార్‌ పాట్నాకు చెందిన శ్రీజ. పసితనంలోనే ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. అయితే ఆమె అలనా పాలనా చూడాల్సిన కన్నతండ్రి.. కర్కశంగా వ్యవహరించాడు. ఆ చిన్నారి ఖర్చులు భరించడం తన వల్ల కాదంటూ.. పైగా ఆడబిడ్డ అనుకుంటూ నిర్లక్ష్యంగా ఇంట్లో ఒక్కదానినే వదిలేసి వెళ్లిపోయాడు.  

చిన్నారి శ్రీజ ఏడ్పు విని స్థానికులు.. ఆమె అమ్మ తరపు బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలిసి  అమ్మమ్మ శ్రీజను అక్కున చేర్చుకుంది. తాతా అమ్మమ్మలే పెంచి.. చదివించారు.  ఏళ్లు గడిచాయి.. ఇప్పుడు తన మనవరాలు సాధించిన విజయంతో ఆ అమ్మమ్మ మురిసిపోతోంది. ‘‘నా కూతురు చనిపోయాక మా అల్లుడు శ్రీజను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతన్ని మేం చూడనే లేదు. మరో వివాహం చేసుకున్నాడని మాత్రమే తెలుసు. ఈ ఫలితం చూస్తే.. అతను కచ్చితంగా తన నిర్ణయానికి పశ్చాత్తాపం చెందుతాడని అనుకుంటున్నా’ అని ఆ అమ్మమ్మ అంటోంది. 

మరోవైపు ఈ సక్సెస్‌పై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ స్పందించారు. శ్రీజకు ఏ విధంగా అయినా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఆయన. మరోవైపు ఇంటర్నెట్‌ సైతం ఆ చిన్నారి విజయంపై హర్షం వ్యక్తం చేస్తోంది. మానసికంగా ధైర్యంగా ఉండి.. మంచి చదువుతో విజయం సాధించిన శ్రీజకు.. ఆమెకు అండగా నిలిచిన అమ్మ తరపు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తోంది.

పుస్తకాల పురుగు అయిన Sreeja శ్రీజ.. అలాగని గంటల తరబడి పుస్తకాలకే అంకితమై పోయేది కాదట. చదువుతో పాటు ఆటపాటలు, ఇతర వ్యవహారాలను చాలా సమానంగా చూసుకునేదట. పరీక్షకు ముందు.. పాత ప్రశ్నాపత్రాలను తిరగేయడం, వాటిని సాల్వ్‌ చేయడం చేస్తూ వెళ్లాను అని అంటోంది ఆమె. ప్రస్తుతం పదకొండవ తరగతి కోసం శ్రీజ DAV-BSEBలో అడ్మిషన్‌ తీసుకుంది కూడా.

మరిన్ని వార్తలు