పవన్‌ ఖేరా నోరు జారారు.. మధ్యంతర బెయిల్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు

23 Feb, 2023 16:04 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి  పవన్‌ ఖేరా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్‌ పార్టీ. సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పొరపాటున ఆయన నోరు జారారని, అందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పాడని కోర్టుకు వివరించారు పవన్‌ తరపు న్యాయవాది. దీంతో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని ఢిల్లీ స్థానిక కోర్టును ఆదేశిస్తూ ఊరట ఇచ్చింది సుప్రీం.

పవన్‌ ఖేరా తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పేర్ల(దామోదరదాస్‌, గౌతమదాస్‌ అనేదానిపై) విషయంలో ఆయనకు స్పష్టత లేదు. ఆయన పొరపాటున నోరు జారారని, తప్పు ఒప్పుకున్నారని,  అందుకు క్షమాపణలు కూడా చెప్పారని సుప్రీంకు వివరించారు. మరోవైపు అసోం పోలీసుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. పవన్‌ ఖేరా అరెస్ట్‌ను ధృవీకరిస్తూ, ట్రాన్సిస్ట్‌ రిమాండ్‌ కింద కోర్టులో ప్రవేశపెడతామని సుప్రీం కోర్టుకు తెలిపారు. 

అయితే.. పవన్‌ ఖేరాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని, అందుకే కేసులు కొట్టేయమని కోరడం లేదని, కేవలం మధ్యంతర బెయిల్‌ ద్వారా ఉపశమనం మాత్రం ఇవ్వమని కోర్టును అభ్యర్థించారు పవన్‌ ఖేరా తరపున న్యాయవాది. 

దీంతో పిటిషనర్‌ తరపు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌.. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని ద్వారకా కోర్టును ఆదేశించారు. ‘పిటిషనర్ (పవన్ ఖేరా) బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ తరుణంలో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలి’ అని సీజేఐ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. 

అలాగే.. పవన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను కలపాలని కోరుతూ పవన్‌ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. దీనికి స్పందించాలంటూ అసోం, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగేంతర వరకు ఆయన మధ్యంతర బెయిల్‌ బయట స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది సుప్రీం కోర్టు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఆ కామెంట్లు.. 

మరిన్ని వార్తలు