వ్యర్థాల నిర్వహణపై రూ.72 కోట్ల జరిమానా

10 Feb, 2021 16:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కంపెనీలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మూడు పెద్ద కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ప్లాస్టిక్‌ బ్యాగులు, బాటిళ్ల సేకరణకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో కోక్‌, పెప్సీ, బిస్లేరీ కంపెనీలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ మూడు కంపెనీలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. 

ఆ మూడు కంపెనీలకు కలిపి దాదాపు రూ.72 కోట్ల జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో బిస్లేరీ సంస్థకు రూ.10.75 కోట్లు, పెప్సీకి రూ.8.7 కోట్లు, కోకాకోలా కంపెనీకి రూ.50.66 కోట్ల జరిమానా విధించింది. వీటితో పాటు రాందేవ్‌ బాబాకు చెందిన పతాంజలి సంస్థకు రూ. కోటి, మరో సంస్థకు రూ.85.9 లక్షల జరిమానా వేసింది. జరిమానాలను 15 రోజుల్లోగా చెల్లించాలని పీసీబీ స్పష్టం చేసింది.

ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ (ఈపీఆర్) అనేది పాలసీ కొలత. దీని ఆధారంగా ప్లాస్టిక్‌ వస్తువులను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తులను పారవేసేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 

  • బిస్లేరి: ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 9 నెలల్లో సుమారు 21,500 టన్నులుగా తేలింది. టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10.75 కోట్లు జరిమానా విధించింది.
  • పెప్సీ: 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. కోకాకోలా బెవరేజెస్‌ సంస్థలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,417 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఈపీఆర్ లక్ష్యం లక్షా 5 వేల 744 టన్నుల వ్యర్థాలు. 

ఈ విధంగా ఒక్కో సంస్థ ప్లాస్టిక్‌ వ్యర్థాలను బట్టి జరిమానాను కాలుష్య నియంత్రణ మండలి విధించింది.

మేం బాధ్యతతో ఉన్నాం: బిస్లేరి
అయితే ఈ వార్తలపై తాజాగా బిస్లేరీ యాజమాన్యం స్పందించింది. తాము బాధ్యతతో ఉన్నామని.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ‘‘కాలుష్య నియంత్రణ మండలి ఇతర పర్యావరణ సంస్థల నియమనిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన పత్రాలు సమర్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం నిబద్ధతతో పని చేస్తున్నాం. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌, వేరు చేయు విధానంపై మేం సమాజంలో అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలలతో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాపై వచ్చిన ఫిర్యాదులను మా బృందం పరిశీలిస్తోంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుంది’’ బిస్లేరీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు