యజమాని ప్రాణాలను కాపాడిన పిల్లి.. నాలుగడుగుల పాముతో..

22 Jul, 2021 11:25 IST|Sakshi

భువనేశ్వర్‌: సాధారణంగా కొంత మంది మూగజీవాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే.. కుక్కలు, పిల్లులు.. తదితర జీవులను తమ ఇం‍ట్లో పెంచుకొని కుటుంబంలో ఒకటిదానిలా చూసుకుంటారు. అవి మనుషుల కన్నా విశ్వాసంగా ఉంటాయని నమ్ముతుంటారు. అయితే, ఒక్కొసారి ఆ పెంపుడు జీవులు తమ యజమానికి ఏదైనా ఆపద సంభవిస్తే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన సంఘటనలు కొకొల్లలు.

తాజాగా ఇలాంటి ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని కపిలేశ్వర్‌కు చెందిన సంపద్‌ కుమార్‌ పరిడా ఒక పిల్లిని పెంచుకున్నారు. దాన్ని ప్రేమతో చినుఅని పిలుచుకునే వారు. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిగా చూసుకునేవారు. ఒకటిన్నర సంవత్సరాలుగా పిల్లిని పెంచుకుంటున్నారు. అది ఇళ్లంతా తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు.. పెరడు నుంచి ఒక నాగుపాము ఇంట్లో ప్రవేశించడాన్ని చిను గమనించింది. వెంటనే అరుచుకుంటూ వెళ్లి పాముకు ఎదురుగా నిలబడింది. అంతటితో ఆగకుండా.. అరుస్తు పామును తన పంజాతో కొట్టసాగింది.

పిల్లి అరుపులు విన్న సంపద్‌ కుమార్‌ అక్కడికి వెళ్లి చూశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అక్కడ నాలుగడుగుల పాముతో తమపిల్లి పోరాటం చేస్తుంది. అవి రెండు పరస్పరం దాడిచేసుకుంటున్నాయి. పాము ఎంత బుసలు కొడుతున్నా.. పిల్లి ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. పామును చూసి భయపడిపోయిన సంపద్‌ వెంటనే స్నేక్‌ హెల్ప్‌ సోసైటీ వారికి ఫోన్‌ చేశాడు. ఈ క్రమంలో, దాదాపు అరగంట పాముని ఇంట్లో ప్రవేశించకుండా.. చిను పోరాటం చేస్తునే ఉంది. 

సంపత్‌ కుమార్‌ పిల్లి, పాముల పోరాటాన్ని తన మొబైల్‌లో ఫోటోలు తీసుకున్నాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్‌ సొసైటీవారు పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. ఆ తర్వాత తన ఆ క్లిప్పింగ్‌లను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ రోజు తాము ఉన్నామంటే దానికి తమ పెంపుడు పిల్లి చిను మాత్రమే కారణమని తెలిపాడు. దీంతో ఈ సంఘటన కాస్త వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు