నేపాల్ నుంచి భారత్ కు పెట్రోల్ అక్రమ రవాణా

23 Feb, 2021 18:19 IST|Sakshi

గత కొద్దీ రోజుల నుంచి భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చ జరుగుతుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూలేనంతగా ఆకాశాన్ని తాకాయి. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ.100గా ఉంది. కానీ, మన పొరుగు దేశమైన నేపాల్‌లో ఇంధన ధరలు దీనికి విరుద్దంగా ఉన్నాయి. మన దేశానితో పోలిస్తే పెట్రోల్ ధరలు నేపాల్‌లో రూ.22 తక్కువగా ఉండటం విశేషం. దేశంలో విపరీతంగా పెరుగుతున్న ధరలను ఆసరా చేసుకొని నేపాల్‌తో సరిహద్దును పంచుకునే రాష్ట్రా ప్రజలు కొత్త దందాను తెరమీదకు తీసుకొచ్చారు.

నేపాల్ సరిహద్దు రాష్ట్ర ప్రజలు అక్కడి నుంచి భారతదేశంలోకి పెట్రోల్ ను అక్రమంగా రవాణా చేయడం ప్రారంభించారు. బీహార్‌లోని అరియారియా జిల్లాలో లీటరు పెట్రోల్ ధర రూ.93.50 కాగా, నేపాల్‌లో లీటరుకు రూ.70.62 మాత్రమే ఉంది. దీనితో బీహార్ రాష్ట్రంలోని అరియారియా, కిషన్ గంజ్ జిల్లా ప్రజలు ఇరుకైన రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దును దాటుతున్నారు. ఈ మార్గాలు ప్రధాన రహదారి లేదా సరిహద్దు చెక్‌పోస్టుకు దూరంగా ఉన్నందున అధికారులు వీటిని గుర్తించలేక పోతున్నారు. అక్కడ తక్కువగా ధరకే కొన్న పెట్రోల్ ను బంకులతో పోల్చితే నాలుగైదు రూపాయలు తక్కువకే వస్తుండటంతో వాహనదారులు కూడా వీరి దగ్గరే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా అమ్ముకుంటున్న వారు రోజుకు కనీసం రూ.2,500 సంపాదిస్తున్నారు. స్థానిక పోలీసులు, ఎస్‌ఎస్‌బి అధికారులు అక్రమంగా పెట్రోల్ తరలిస్తున్న చాలా మందిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

చదవండి:

ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు

మరిన్ని వార్తలు