ఆల్‌టైమ్‌ రికార్డ్‌: రూ.91కి చేరిన పెట్రోల్‌ ధర

13 Jan, 2021 10:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.85కి చేరింది. దీనికి పోటీగా డీజిల్‌ ధర రూ.83.87కి వచ్చింది. ఈ ధరలు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ధరలు జైపూర్‌లో ఉన్నాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.84.45కు పెరిగింది. డీజిల్‌ రూ.74.38 నుంచి రూ.74.63కు చేరింది. ఇక ధరల్లో రెండోస్థానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.91.07కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.34గా ఉన్నది. 

వాస్తవంగా గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించేవి. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017 జూన్‌ 15వ తేదీ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా పెంచడం.. తగ్గించడం చేస్తోంది. చమురు కంపెనీలు పెట్రో ధరలను ప్రతి రోజు సమీక్షించి ధరలను నిర్ణయిస్తాయి. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో పెట్రోల్‌ ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి       

నగరం పెట్రోల్‌ (రూ.) డీజిల్‌ (రూ.)
చెన్నై  87.18 79.95
కోల్‌కతా  85.92  78.22
హైదరాబాద్  87.85   81.45
బెంగళూరు 87.30        79.14
జైపూర్ 91.85    83.87 (దేశంలోనే అత్యధికం)

మరిన్ని వార్తలు