ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితుడు చేసిన పనికి కలెక్టర్‌ ఫిదా..  

29 Apr, 2021 13:15 IST|Sakshi

భువనేశ్వర్‌: దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. మొదటిదశ కంటే.. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారింది. వైరస్‌ ఉధృతికి ప్రజలందరూ విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే, చాలా మంది కోవిడ్‌ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే ఇప్పటికే  చాలా ఆసుపత్రులలో కోవిడ్‌ బాధితులకు సరైనా సదుపాయాలు కల్పించలేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  ఈ క్రమంలో, ఒడిశాలోని కులాంగే జిల్లాకు చెందిన విజయ్‌ కులాంగె అనే ఐఏఎస్‌ అధికారి ఒక కోవిడ్‌ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి వెళ్లారు. కాగా, అక్కడ ఆసుపత్రి బెడ్‌పై ఒక కోవిడ్‌ బాధితుడు చేసిన పనికి ఆశ్చర్యపోయారు.  అంతటితో ఆగకుండా దీన్ని ఫోటో తీసి తన  ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌ అయ్యింది.

కాగా, ఇందులో ఒక విద్యార్థి ఆసుపత్రి బెడ్‌పై కూర్చుని సీఎ పరీక్షల కోసం చదువుతున్నాడు. అతనిలో తనకు కోవిడ్‌ సోకిందనే బాధ ఏమాత్రం లేదు. అతడి ధ్యాసంతా సీఎ (ఛార్టెడ్‌ అకౌంటెంట్‌) పరీక్షల మీదే ఉంది. ఈ నేపథ్యంలో సదరు బాధితుడి అంకిత భావం పట్ల కలెక్టర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కరోనా సోకిందని బాధపడకుండా ఆశాభావ దృక్పథంతో ఉన్నాడని కలెక్టర్‌ అతడిని అభినందించారు. అయితే, ప్రజలందరూ కూడా కరోనా సోకిందని, ఏదో అయిపోతుందనే భయాన్నివదిలిపెట్టాలని అన్నారు. ఈ మహమ్మారిని ధైర్యంతో ఎదుర్కొవాలని కోరారు. కాగా, ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ‘ సీఎ విద్యార్థి అంకిత భావానికి హ్యట్సాఫ్‌.. మీరు కోవిడ్‌ను గెలుస్తారు.. సీఎ పరీక్షలోనూ విజయం సాధిస్తారని’ కామెంట్లు పెడుతున్నారు. 

మరిన్ని వార్తలు