స్వతంత్ర కొలీజియంను ఏర్పాటు చేయాలి
సుప్రీంకోర్టులో ఏడీఆర్ వ్యాజ్యం
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేవలం కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్) మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తుండడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఆక్షేపించింది. కార్యనిర్వాహక వర్గం మాత్రమే సీఈసీని, ఎన్నికల కమిషన్లను నియమించడం ఏమిటని ప్రశ్నించింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకానికి తటస్థంగా వ్యవహరించే స్వతంత్ర కొలీజియం/ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఈ బాధ్యతను కార్యనిర్వాహక వర్గానికి కట్టబెడితే అధికారంలో ఉన్న పార్టీ విధేయులే ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమితులయ్యే ప్రమాదం ఉందని ఏడీఆర్ పేర్కొంది. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, ఆరోగ్యకరమైన ప్రజాస్వా మ్యం కొనసాగాలన్నా ఎన్నికల సంఘాన్ని కార్యనిర్వాహక వర్గం పరిధి నుంచి తప్పించాలని కోరింది.