డిసెంబర్‌ 4న మోదీ అఖిలపక్ష సమావేశం

30 Nov, 2020 15:28 IST|Sakshi

అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్ష వర్ధన్‌తో సహా పలువురు మంత్రులు హాజరు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై చర్చించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4 (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మోదీ, ఆల్‌ పార్టీ మిటింగ్‌ నిర్వహించడం ఇది రెండో సారి. ఇక ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మినిస్టర్‌ అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి‌ ప్రహ్లాద్‌ జోషి తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని పార్టీ నాయకులను సంప్రదించినట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 94 లక్షలకు మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఇక కోవిడ్‌ కేసుల్లో ప్రపంచంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే అమెరికాతో పోలిస్తే ఇండియాలో కోవిడ్‌ మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. 

ఇక ఇప్పటిక వరకు దేశ వ్యాప్తంగా 88 లక్షలకు పైగా కోవిడ్‌ బారిన పడి కోలుకోగా.. 1.3లక్షలకు మందికి పైగా మరణించారు. దేశంలో తొలి కోవిడ్‌ మరణం జనవరి 30, 2020న కేరళలో నమోదయ్యింది. ఇక ప్రపంచ దేశాలన్ని కరోనా వ్యాక్సిన్‌ కోసం కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా నాలుగైదు వ్యాక్సిన్‌లు పలు దశల్లో ఉన్నాయి. దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేలలో సుడిగాలి పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు