రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ కొత్త రూల్స్!

27 Oct, 2021 17:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకంలో అనర్హులు చేరుకుండా అరికట్టడానికి కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే, పెరుగుతున్న మోసాన్ని తనిఖీ చేయడం కోసం కేంద్రం ఇటీవల ఈ పథకానికి నమోదు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అవసరమైన పత్రాలలో మార్పులు చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ పథకంలో జాయిన్ అయ్యేందుకు రిజిస్టర్ చేసే లబ్ధిదారుని రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. అంతేకాకుండా, లబ్ధిదారులు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీని కూడా పోర్టల్‌లో సమర్పించాల్సి ఉంటుంది. 

రేషన్ కార్డు తప్పనిసరి
ఇక నుంచి రేషన్ కార్డు లేకుండా పీఎం కిసాన్ పథకంలో జాయిన్ అయ్యే అవకాశం లబ్ధిదారునికి లేదు. పీఎం కిసాన్ కింద రిజిస్టర్ చేసుకోవడానికి, ఈ పథకం కింద ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారుడు వారి రేషన్ కార్డు నంబర్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, డిక్లరేషన్ ఫారంతో సహా ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా మోసపూరిత కార్యకలాపాలను అరికట్టవచ్చు అని కేంద్రం భావిస్తుంది.

(చదవండి: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్‌కు భరోసా!)

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందించే 10వ వాయిదా తేదీని కూడా కేంద్రం నిర్ణయించింది. డిసెంబర్ 15, 2021 నాటికి లబ్ధిదారుని ఖాతాలో నగదు జమ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కేంద్రం చేస్తుంది. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలనుకునే కొత్త రైతులు ఆ తేదీలోపు ముందస్తుగా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఏటా రూ.6,000 లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారుని ఖాతాకు బదిలీ చేస్తుంది.

(చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!)

మరిన్ని వార్తలు