ప్రపంచానికి మన బలమేంటో చూపించాం: ప్రధాని మోదీ

8 Feb, 2021 11:24 IST|Sakshi

ప్రపంచం మొత్తం భారత్‌ వైపే చూస్తోంది

కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలిచాం

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ భారత్‌లో కొనసాగుతోంది

రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని ధన్యవాద తీర్మానం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ పోరాటంలో భారత్‌ ప్రదర్శించిన స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్‌ విపత్తును భారత్‌ ఎదుర్కున్న తీరు ప్రసంశనీయమని, ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని అన్నారు. దేశం మరింత బలపడటానికి కరోనా వైరస్‌ బాటలువేసిందన్నారు. మన బలమేంటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. లాక్‌డౌన్‌సమయంలో కరోనా వారియర్స్‌  చేసిన సేవ వర్ణించలేనిదని వారి సేవలను కొనియాడారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపడుతోందని వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియనలో భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. కోవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ సమర్థవంతగా ఎదుర్కొందని, కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ టీకా అభివృద్ధిలో మనదేశ శాస్త్రవేత్తలు పోషించిన పాత్ర వర్ణించలేనిదని కొనియాడారు. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. ‘కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలిచాం. అనేక దేశాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపిస్తున్నాం. ప్రపంచ ఫార్మా హబ్‌గా భారత్‌ ఎదుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ భారత్‌లో కొనసాగుతోంది.. మన బలమేంటో ప్రపంచానికి అర్థమైంది. నూతన అవకాశాల నిలయంగా భారత్‌ మారుతోంది. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. అనేక అవకాశాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. కనిపించని మహమ్మారి కరోనా. కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతున్నాం. దేశానికి కరోనా వారియర్స్‌ చేసిన సేవలు మరువలేనివి. సంక్షోభం కారణంగా భారత్‌ మరింత బలపడింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ వైపు అడుగులు పడేలా చేసింది. కరోనాపై విజయం ప్రభుత్వానిది కాదు.. ప్రజలందరిది. మానవాళి రక్షణకు భారత్‌ కృషిని ప్రపంచమంతా ప్రశంసిస్తోంది’ అని అన్నారు. 

సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకం అన్నారు. సభ్యులంతా అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షం బహిష్కరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రైతు దీక్షలను ప్రస్తావించారు. కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం పార్లమెంట్‌ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు