దేశానికి ఆయ‌న‌ సజీవ ప్రేరణ : ప్రధాని మోదీ

8 Nov, 2020 16:24 IST|Sakshi

అద్వానీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన మోదీ

సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బీజేపీ కురవృద్ధుడు ఎల్‌కే అద్వానీ 93వ పుట్టిన రోజు నేడు (నవంబర్‌ 08). ఈ సందర్భంగా  ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన రాజకీయ గురువు అద్వానీ ఇంటికి వెళ్లి పాదాభివందనం చేసి ఆశీర్వదాలు తీసుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేయించి పుట్టిన రోజు వేడులకును జరిపారు. 

దీనికి సంబంధిన ఫోటోలను మోదీ తన ట్విటర్‌ ఖాతాలో ఫోస్ట్‌ చేస్తూ..‘అద్వానీ జీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన నివాసానికి వెళ్లడం జరిగింది. ఆయనతో సమయం గడపటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయ‌న‌ సజీవ ప్రేరణ. ఆయ‌న జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ వెంటహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. 

మరిన్ని వార్తలు