-

నిలకడగా లాలూ ఆరోగ్యం.. పరామర్శించిన నితీశ్‌, ఫోన్‌లో ప్రధాని మోదీ ఆరా

6 Jul, 2022 15:31 IST|Sakshi

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌(74) ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ మేరకు ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌ బుధవారం మీడియాకు తెలిపారు. బుధవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన ఎయిర్‌ ఆంబులెన్స్‌లో తరలించడంతో ఆయన పరిస్థితి విషమించిందంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటిని తేజస్వి యాదవ్‌ ఖండించారు. 

అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, లాలూ ఆరోగ్యంపై ఆరా తీశారు.  తేజస్వీ యాదవ్‌కు ఫోన్ చేసి ఆయన యోగ క్షేమాలు  అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని తనయుడు తేజస్వి యాదవ్‌ ప్రకటించారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యల కోసం ఢిల్లీకి షిఫ్ట్‌ చేసినట్లు వెల్లడించాడాయన.

లాలూ సోమవారం వేకువజామున ఇంట్లో మెట్లపై నుంచి కాలుజారి పడిపోయారు. ఆయన కుడి భుజానికి ఫ్రాక్చర్ అయింది. పాట్నాలోని పరాస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. భార్య రబ్రీదేవితో పాటు లాలూ ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్‌, సూర్యప్రతాప్ యాదవ్‌ ఆయనతో పాటే ఉన్నారు. కుడి భుజం గాయంతో పాటు లాలూ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.

దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ  ప్రసాద్‌ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తూ రెండు నెలల క్రితమే బెయిల్‌పై విడుదల అయ్యారు. అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలనుకునే సమయంలో అనుకోకుండా ప్రమాదానికి గురై కాలుజారిపడ్డారు.

మరిన్ని వార్తలు