రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం: ప్రధాని మోదీ కీలక భేటీ

24 Feb, 2022 17:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ విమనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యుద్ధ ప్రభావం పరోక్షంగా ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్‌ చూపించనుంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో సామాన్యులపై మరింత భారంపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్‌ అయింది. చమురు ధరలు(Petrol, Diesel) పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఆర్థిక మంత్రి నిర‍్మలా సీతారామన్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ముడి చమురు ధరల ప్రభావాన్ని తగ్గించే మార్గాలపై చర్చించునున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 2022లో గరిష్ట స్థాయికి పెరిగింది. ఎంసీఎక్స్'లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర గురువారం రూ. 1,400కు పైగా పెరగడంతో రూ. 51,750 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. వెండి ధర సైతం రూ. 2300కి పైగా పెరిగి రూ. 66,501కి చేరుకుంది.

(ఇది చదవండి: ఉక్రెయిన్‌లో ప్రమాదం అంచున భారత పౌరులు..!)

మరిన్ని వార్తలు