దేశంలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ప్రారంభించిన మోదీ..

6 Feb, 2023 18:23 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక తుమకూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మోదీ శంకుస్థాపన చేసిన హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దది. 615 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారత్‌లో హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచే తీర్చాలనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో మొదటగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు(తేలికపాటి హెలికాప్టర్లు) మాత్రమే తయారు చేస్తారు. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. మూడు టన్నుల బరువుండే ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను అత్యంత సులభంగా నడపవచ్చు.

ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం నుంచి తొలుత ఏడాదికి 30 హెలికాప్టర్లు ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ఏడాదికి 60, 90 హెలికాప్టర్లను తయారు చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతారు. ఈ కేంద్రం నుంచి 3-15 టన్నుల బరువుగల 1000 హెలికాప్టర్లను తయారు చేయాలని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ లక్ష‍్యంగా పెట్టుకుంది. వచ్చే 20 ఏళ్లలో రూ.4లక్షల కోట్ల వ్యాపారం చేయాలని భావిస్తోంది.


చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. 

>
మరిన్ని వార్తలు