నాలుగేళ్ల చిన్నారిపై మోదీ ప్రశంసలు

2 Nov, 2020 16:16 IST|Sakshi

న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారి ఎస్తేర్‌ హమ్నాట్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం చిన్నారిపై ప్రశంసలు కురిపించారు. ఇక నెటిజన్ల ప్రశంసలకైతే హద్దే లేకుండా పోయింది. మరి ఇంతకు ఆ చిన్నారి ఏం చేసింది.. ఎందుకు ఇన్ని ప్రశంసలు అందుకుంటుందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. బంకీమ్ చంద్ర చటోపాధ్యాయ వందేమాతం వర్షన్‌ని ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత, ప్రఖ్యాత భారతీయ సంగీతకారుడు ఏఆర్‌ రెహమాన్‌‌ చేసి ‘మా తూజే సలాం’ పేరిట రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను మిజోరాంకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎస్తేర్‌ హమ్నాట్‌ అంతే హృద్యంగా పాడింది. చిన్నారి ప్రతిభకి మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్‌తంగ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇది కాస్త ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది. (చదవండి: అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!)

మోదీ కూడా హమ్నేట్‌ టాలెంట్‌కు ముగ్దుడయ్యారు. ‘ఎస్తేర్‌ హమ్నేట్‌ వందేమాతర ప్రదర్శన అమోఘం.. అద్భుతం’ అని ప్రశంసిస్తూ జోరామ్‌తంగ‌ ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే అమితాబ్‌ వంటి పెద్దల ప్రశంసలు పొందిన హమ్నేట్‌.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మెప్పు కూడా పొందింది. దాంతో సోషల్‌ మీడియాలో తెగ వైరలయిన ఈ వీడియో.. మోదీ ప్రశంసలతో మరో సారి వెలుగులోకి వచ్చింది. ‘ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు భారతీయులని గర్వపడండి, ఇది ప్రేమ, సంరక్షణ, ఆప్యాయతలకు పుట్టిల్లు. మనోహరమైన వైవిధ్యత దీని సొంతం’ అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

మరిన్ని వార్తలు